రోహిత్ శర్మకు విశ్రాంతి
భారత స్టార్ ఓపెనర్ రోహిత్ శర్మకు సొంతగడ్డపై వెస్టిండీస్తో జరిగే పరిమిత ఓవర్ల సిరీస్లకు విశ్రాంతినిచ్చే అవకాశాలున్నాయి. ఈ ‘హిట్మ్యాన్’పై కోహ్లి లేని సందర్భంలో నాయకత్వ బాధ్యతల్ని మోసిన విపరీతమైన పని ఒత్తిడిని జాతీయ సీనియర్ సెలక్షన్ కమిటీ గమనిస్తోంది. అదే విధంగా ఫామ్లేమితో తంటాలు పడుతున్న శిఖర్ ధావన్కు ఉద్వాసన ఇచ్చినా ఆశ్చర్యం లేదు. గురువారం ముంబైలో సమావేశమయ్యే ఎమ్మెస్కే ప్రసాద్ నేతృత్వంలోని కమిటీ విండీస్తో పరిమిత ఓవర్ల క్రికెట్కు టీమిండియాను ఎంపిక చేయనుంది. ప్రధానంగా రోహిత్కు విశ్రాంతినిచ్చి ధావన్ను తప్పించే అంశాల్నే కమిటీ పరిశీలించనుంది.
బహుశా చీఫ్ సెలక్టర్ ఎమ్మెస్కే ఎంపిక చేసే ఆఖరి జట్టు ఇదే అవుతుందేమో. ఆయన నాలుగేళ్ల పదవీ కాలం ముగియనుంది.భారత్ విండీస్తో సొంతగడ్డపై ముందుగా మూడు టి20లు, మూడు వన్డేలు ఆడనుంది.ఈ ఏడాది రోహిత్ కోహ్లి కంటే ఎక్కువ మ్యాచ్లు ఆడాడు.
ఐపీఎల్తో కలుపుకొని 60 మ్యాచ్లు ఆడి ఉండటంతో రెస్ట్ ఇచ్చి న్యూజిలాండ్ పర్యటనకు అతన్ని తాజాగా సిద్ధం చేయాలని ఎమ్మెస్కే కమిటీ భావిస్తోంది. ప్రపంచకప్ గాయం తర్వాత జట్టులోకి ధావన్ పెద్దగా రాణించలేదు. దేశవాళీ క్రికెట్లోనూ అతని ప్రదర్శన పేలవంగా ఉంది. మరోవైపు మయాంక్ అగర్వాల్ టెస్టుల్లో తనకు అందిచిన అవకాశాల్ని సద్వినియోగం చేసుకున్నాడు.
దీంతో లోకేశ్ రాహుల్కు జతగా మయాంక్కు అవకాశం ఇవ్వొచ్చు. అలాగే నిలకడగా రాణిస్తున్న సంజూ సామ్సన్కు వికెట్ కీపర్ రిషభ్ పంత్ స్థానంలో చోటు దక్కవచ్చు. కొత్త పేస్ ఎక్స్ప్రెస్ దీపక్ చాహర్ స్థానానికి ఏ ఢోకా అనేది ఉండదు. పైగా హార్దిక్ పాండ్యా, బుమ్రా, నవ్దీప్ సైనీ, భువనేశ్వర్లు వివిధ రకాల గాయాలతో ప్రస్తుతం వీరు కోలుకుంటుండటంతో శివమ్ దూబే, శార్దుల్ ఠాకూర్లను కొనసాగించే అవకాశముంది. అలాగే సెలక్టర్లు వాషింగ్టన్ సుందర్, కృనాల్ పాండ్యాల ఎంపికను పరిశీలించే అవకాశముంది.